Monday, October 8, 2012

కుజ, పుత్ర దోషాలు అంటే ఏమిటో తెలుసా..?







ఏలినాటి శని ప్రభావం తరహాలో కుజ దోషమంటేనే అందరూ భయపడటం సహజం. కానీ కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతుంది.

సాధారణంగా కుజ దోషమంటే కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో, చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ కుజదోష జాతకులిరువురు వివాహం చేసుకోదలచుకుంటే జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

జాతకంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషం తప్పక ఉన్నట్టే. పై స్థానాల్లో కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లయితే.., లేదంటే ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషానికి పరిహారాలున్నాయి.

కాగా కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకోవాలంటే..
1. జాతకం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికి ఒకే విధమైన పూర్ణవంతమైన దోషాన్ని కలిగి ఉండాలి. (లేక)
2. స్త్రీ , పురుషులకు ఎటువంటి పూర్ణవంతమైన దోషం ఉండకూడదు.
పై రెండు లేని పక్షంలో ఇద్దరికి కుజదోషపరిహారం చేసుకునే మార్గమైనా ఉండితీరాలి.
ఇంకా కుజుని దశ ఇద్దరికి ముగించే స్థాయిలోనైనా కుజదోషస్థులు వివాహం చేసుకోవచ్చు.

ఇక పుత్ర దోషం - పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి. ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది.

ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే "నాగదోషమని" పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన పక్షంలో నాగదోషం తొలగిపోవటంతో పాటు పుత్రప్రాప్తి లభిస్తుంది.

పరిహారాలు :
1. పుత్ర దోషం కలవారు నాగ విగ్రహ సమేతంగా గల వేపచెట్టు, మర్రి చెట్టులను 41 రోజులు ప్రదక్షిణ చేయాలి. 41 వరోజు అర్చన చేయాలి.
2. వెండితో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం (41రోజులు) పూజచేసి శివాలయాల్లో సమర్పించటమో లేక హుండీలలో వేయటమో చేయాలి.
3. రామేశ్వరం, శ్రీ కాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలలో నాగదోష నివారణకు పూజలు చేసి పరమేశ్వరుని ధ్యానించటం ద్వారా పుత్రప్రాప్తి లభించటంతో పాటు పుత్రదోషం తొలగిపోతుంది.