Tuesday, October 9, 2012

శయన ఏకాదశి నుంచి 4 మాసాలు 'గోపద్మ వ్రతం' చేయండి








ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా, శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు (నేడు) శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ వ్రతం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈనాటి నుంచి పాల కడలిలో నాలుగు నెలలపాటు మహావిష్ణువు శయనిస్తాడు. కనుకనే దీన్ని శయన ఏకాదశి అన్నారు.

తొలి ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలను పాటిస్తుంటారు. ఇంకా ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి వరకు గోపద్మ వ్రతం ఆచరించే వారికి శ్రీ మహావిష్ణువు కోరిన కోర్కెలను నెరవేరుస్తాడని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించని మహిళలను యమధర్మరాజు శిక్షిస్తాడని పద్మపురాణం చెబుతోంది.

ఈ వ్రతం ప్రకారం నాలుగు నెలల పాటు శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. తొలి ఏకాదశి నుంచి ఇంటిల్లాపాదిని శుభ్రం చేసుకుని అలికి ముగ్గులు పెట్టాలి. ప్రత్యేకంగా బియ్యపు పిండితో ముఫ్పై మూడు పద్మాలను తీర్చిదిద్ధి గంధ పుష్పాలతో శ్రీహరిని పూజించి ప్రదక్షిణ నమస్కారించాలి. 33 అప్పాలను వేద పండితులకు వాయనం ఇవ్వాలి.

గ్రామీణ ప్రజలైతే పశువుల కొష్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నాలుగు మాసాలు పరిశుభ్రతతో మహావిష్ణువును పూజించి, కార్తీక శుక్ల ద్వాదశి నాడు నారాయణ స్వామిని నిష్టతో పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఈ నాలుగు నెలల పాటు విష్ణుమూర్తిని అర్చించి, లీలా విశేషాలు, పురాణ పఠనం వల్ల అష్ట కష్టాలు తొలగిపోయి, సిరిసంపదలు చేకూరుతాయి.

మరోవైపు నాలుగు నెలల పాటు మహావిష్ణువు జల శయనం చేయడం వల్ల విష్ణు తేజం నీటిలో వ్యాపించి ఉంటుంది. అందుకే చాతుర్మాస్యం (నాలుగు నెలలు) చేసే నదీ స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది.

నదికి వెళ్లి స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న నది, చెరువు లేదా బావుల్లో భక్తిపూర్వకంగా స్నానం ఆచరించి పుణ్య ఫలాన్ని పొందవచ్చు. ఇంకా చాతుర్మాస్య ప్రారంభం, సమాప్తం సమయాల్లో విష్ణు భగవానునికి అతి ప్రీతికరమైన ఏకాదశుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.

ఇంకా ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత:
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః
వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్. అని చాతుర్మాస్య దీక్షా ప్రశస్తిని గురించి స్కాంద, భవిష్యోత్తరాది పురాణములో తెలుపబడి ఉంది.

గృహస్థులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కామక్రోధాదులను వీడి, ఒంటిపూట భోజనము చేస్తూ దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే అశ్వమేథయాగఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.