Tuesday, October 9, 2012

శ్రావణ సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తే..!?







మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.

పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శుక్రవారం మాత్రమే గాకుండా శ్రావణ మాసంలో ప్రతి రోజూ ఏ దేవతలను కొలవడం మంచిదనే విషయాన్ని పరిశీలిస్తే..

ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.

సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,

మంగళవారం గౌరీ వ్రతం,

బుధవారం విఠలుడికి పూజలు,

గురువారాల్లో గురుదేవుని ఆరాధన,

శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,

శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి.. భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇందులో ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవడం ద్వారు పుణ్య ఫలితాలు చేకూరుతాయి. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.

అలాగే ఆలయాల్లో పూజలు నిర్వహించడమే గాకుండా గృహాల్లో నోములు చేసి శనగల వాయనం ఇవ్వడం మంచిది. ఇంకా పెళ్ళైన కొత్తలో వివాహితులు మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం వంటివి ఆచరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.